‘తల్లికి వందనం’ ( Thalliki Vandanam ) పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు రూ.13 వేలు జమ చేయడం జరిగింది. జూన్ నెలలోనే 63,77,898 మంది విద్యార్థులకు సంబంధించి మొత్తం రూ.8,291.27 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయినప్పటికీ, కొంతమంది అర్హులైనా నిధులు అందలేదు.
ఈ విషయంపై సచివాలయాల్లో గ్రీవెన్సు ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారిలో 2,79,720 మందికి రూ.363.64 కోట్లు విడుదల చేయాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఇంకా చెల్లింపులు జరగలేదు. ఇది ప్రాసెస్లో ఉందని అధికారులు చెబుతున్నారు.
అర్హతలు ఉన్నప్పటికీ కొందరి ఖాతాల్లో నిధులు జమ కాలేదు. కారణం? చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాల్లో సాంకేతిక తప్పులు, ఆధార్ నెంబర్లు చెల్లుబాటు కాకపోవడం, నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండటం లేదా పన్ను చెల్లించే వారు అయి ఉండటం. ఎక్కువమంది విద్యార్థుల తల్లులు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం చేస్తుండడం వల్ల అనర్హులుగా నిలిచారు.
అలాగే, కొంతమంది తల్లుల ఖాతాల్లో రూ.7 వేలు, కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఇలాంటి వారి నిధుల విషయంలో కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీరి ఖాతాల్లో నిధుల విడుదల దిశగా నిర్ణయం జరగనుంది.
